Monday, August 3, 2009

మాస్టరు సి.వి.వి


Master C.V.V

మాస్టర్ C.V.V (కంచుపాటి వెంకట్రావ్ వెంకస్వామి రావు) గారు 4,ఆగష్టు 1868లో తమిళనాడు రాష్ట్రము నందలి కుంభకోణములో జన్మించారు.

పరతత్వం, గురుతత్వం

మాస్టరు సి.వి.వి అనే మహా చైతన్యం ఈ భూమికి దిగి రావడం ఒక అద్భుతమైన అంశం, అది ఎక్కడెక్కడో ఊర్ధ్వ లోకాల నుండి దిగివచ్చి, మన గోళం చేరుకొని, మనల్ని చేరుకుంది. కేవలం మనమీద ఉండే అపారమైన ప్రేమ, కరుణ, ఆదరము, వాత్సల్యం కారణాలుగా మనల్ని ఉద్ధరిద్దామని మనల్ని చేరింది. మనని పరిచయం చేసుకుంది. అసలు ప్రతిరోజూ ఎక్కడినుండో సూర్యరశ్మి వచ్చి మనల్ని చేరుతున్నదే, అది మనల్ని చేరే సమయానికి మనం ఎంత సిద్ధంగా వుంటున్నాము? అంతకన్నా దూరమైనటువంటి లోకాలనుండి దిగివచ్చిన "కుంభచైతన్యపు ప్రజ్ఞ" మనమెరిగినటువంటి, మనం అనుకుంటున్నటువంటి మాస్టరు సి.వి.వి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని "తెర వెనుక ప్రజ్ఞ" అంటారు. ఆంగ్లంలో The background conciouness అంటారు. అందుకే మనకి మాటి మాటికి గుర్తురాదు. మనకి తెరముందు కథే అంతంత మాత్రం. ఇక్కడ కథకన్న వెనుక తెర వున్నది. ఆ తెరవెనుక "అది" వున్నది. దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు.

తెర వెనుక విషయం గుర్తుకు వస్తే, తెర చిన్నదైపొతుంది. కనుక తెర వెనుక వున్న ప్రజ్ఞ మనకి తెలిస్తే, మన మాస్టరు సి.వి.వి అంటే ఎమిటో తెలుస్తుంది.

అవతరణము

చైతన్యం వుండగ, విశ్వాత్మక చైతన్యం వుండగ, ఆ చైతన్యాన్ని నడిపించే చైతన్యంగా మాస్టరు సి.వి.వి ప్రజ్ఞ వున్నది అని చెప్పారు. అంటే అది పరతత్వం లేక పరబ్రహ్మతత్వము. కనుక ఆ తత్వము సరాసరి మరోసారి మనల్ని అనుగ్రహించడానికి అంతరిక్షములో వుండే రకరకములైన మండలములు దాటి వచ్చి, సరాసరి సింహరాశిలో ప్రవేశించి, సింహరాశి నుండి సరాసరి శ్రావణమాసంలో ప్రవేశించి, అక్కడ నుండి, శ్రావణ పౌర్ణమి ఘడియలలో భూమికి దిగివచ్చి, బహుళ పాడ్యమినాడు ఒక శరీరాన్ని బాహ్యంగా బయటకి వ్యక్త పరచింది. ఆ రోజు 4 ఆగష్టు 1868.

"ఎందుకు దిగివచ్చింది?" అని అడిగితే, "మనకోసమే". "మనలో ఏమి మార్పులు చేయడానికి దిగివచ్చింది"? అంటే "మనలో వుండే సూక్ష్మ శరీరాన్ని చక్కగా నిర్మాణం చేసి, అది నశించకుండ వుండేటట్లుగ దాన్ని స్థిరపరచి, అది కారణంగా మనకి మరణం లేనటువంటి స్థితిని ప్రసాదించడం కోసం దిగివచింది". సూక్ష్మశరీర నిర్మాణమును పటిష్ఠము చేసి, అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి యోగములో నూతన పరిణామము తీసుకొని వచ్చింది.

ఇది ఆయనకు ఈయబడిన కర్తవ్యము. దానిని ఆయన సక్రమంగ, నిశ్శబ్దంగ, గుప్తంగ, గుట్టుగా నిర్వర్తించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అంటే, మనలోకి, మన పరిసరాలలోకి అదృశ్యులైనారు. అంతకు ముందు దృశ్యంగా వుండే మాస్టరు ప్రజ్ఞ, ఇప్పుడు భూగోళం అంతా అదృశ్యంగ, తన యొక్క సూక్ష్మ శరీరంతో ఆవరించి వున్నది.

ప్రజ్ఞగా తను ఆవరించి వుండి, పిలిచినవారిలో ప్రవేశించి, వారి సూక్ష్మ శరీరాన్ని నిర్మాణము చేసి, పునరుత్థానం చేసి "మరణం లేని స్థితి కల్పిస్తా" నని వాగ్దానం చేసారు. "అందరికీ చావులేని స్థితిని కలిగించడానికి, అందరికీ బ్రహ్మత్వం అనుభూతి చెందింప జేయడనికి నేను దిగివచ్చాను. అది అయ్యేంతవరకు ఈ భూమి ఆవరణలో వుంటాను" అని మాస్టరు గారు చేసిన చక్కని వాగ్దానం మనకి వున్నది. వారికిగా వారే 18 సార్లు మరణించి జీవించినట్లుగా తన అనుయాయులకు ప్రదర్శించి చూపించారు. షిరిడి సాయి కూడా అలాగే మృత్యువు లేదని ప్రదర్శించారు.

మరణం లేదని తెలియాలి అంటే, ఒక నిర్దిష్ట పథకం లేక విధానం ప్రకారం సూక్ష్మ శరీరం పటిష్ఠంగా నిర్మాణం కావాలి.

సూక్ష్మశరీరం

సూక్ష్మశరీరం నుండే భౌతిక శరీరానికి ప్రాణము అందుతూ వుంటుంది. ప్రాణం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగాను, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన అనే ప్రాణ ప్రవృత్తులు గాను, గుండె, ఊపిరితిత్తులు, శ్వాస అవయవములు కదలటముగాను గోచరిస్తుంది. సూర్యరశ్మినుండి ప్రాణం సూక్ష్మ శరీరంలో ఉండే చక్రముల ద్వారా భౌతిక శరీరంలో ఉండే గ్రంథుల నుండి భౌతిక శరీరానికి అందింపబడుతుంది.

ఈ సూక్ష్మ శరీరానికి రెండు రకాల ఆటు పోట్లుంటాయి. ఒకటి, మనలో ఉండే కోరికలు అసంబద్దముగాను, ధర్మానికి వ్యతిరేకముగాను, ధర్మాన్ని అతిక్రమించి వుంటే, కామ శరీరం అనే తుప్పు, ఈ సూక్ష్మ శరీరం చుట్టూ చేరుతుంది. అందుకే మహాత్ములంతా "కోరికలను సరిచూసుకో" అని చెప్తారు.

మాస్టరు సి.వి.వి గారు "నీ కోరికలను నాకు వదిలేసెయ్యి, నీకు ఏంకావాలో అది నన్ను కోరు. నేను, నీ సమస్త సౌకర్యాలను చూసేవాడినని నమ్మకం వుంటే ఇంక ఎవరినీ ఏమీ కోరక" అని చెప్పారు. కోరడం మొదలు పెడితే సూక్ష్మ శరీరానికి దెబ్బ తగులుతుంది. ప్రతీ కోరికా, ఇనుపముక్కకి తుప్పు పట్టినట్లుగా వుంటుంది. కామ శరీరం పెరిగితే, యోగమయమైన సూక్ష్మ శరీరాన్ని బాగా సన్నగిల్ల చేస్తూ వుంటుంది.

ఇదంతా దేనివలన? కామం వలన. మరి కామం వుండ కూడదా? ఉండవచ్చు. అది ధర్మసమ్మతంగ, ప్రకృతి సిద్ధంగ, సహజంగా వుండాలి. అసహజంగా, అతిగాను, మితిమీరిన కోరికలు కోరడంగాను వుండరాదు.

అందుకనే మాస్టరు సి.వి.వి గారు "నాకు దణ్ణం పెట్టినవాళ్ళు, మనసులో ఎటువంటి కోరికలు పెట్టుకోవద్దు. ఒకవేళ బలీయంగా మీ సంస్కారం లోంచి కోరికలు వస్తే, అవి ప్రార్థనా సమయంలో నాకు సమర్పణ చేయండి. అందులో మీకు శ్రేయస్సు కలిగించేవి నేను మీకు ఏర్పాటు చేస్తాను. శ్రేయస్సు కలిగించనివి, తీవ్రముగా మీ మనస్సుని బాధపెట్టేవి వుంటే వాటి యందు మీకు మరపు వచ్చేట్లుగా మాయం చేస్తాను" అని చెప్పారు.

సూక్ష్మ శరీర నిర్మాణానికి మొదటి మెట్టు "కోరికలు కోరవద్దు".

ప్రార్థన

నీకు నేను త్వరితగతిని సూక్ష్మ శరీర నిర్మాణం చేసిపెడతాను. ఇది జరగటానికి నేనిచ్చిన, బీజాక్షరాల్ని శ్రద్ధతో, భక్తితో ఉచ్చరించి, విని, కన్నులు మూసుకొని లోపల జరిగే ప్రక్రియను గమనిస్తూ వుండు అన్నారు. అది మంత్ర జపంలాగ చేయవద్దు అన్నారు. ఎందుకంటే అది జపానికి సంబంధించిన మంత్రం కాదు కనుక. అలాగే రూపాన్ని కూడ ఎక్కువ ధ్యానం చెయ్యవద్దని అన్నారు.

ఒకసారి రూపాన్ని చూచి, వారి కన్నులను చూచి, లఘువుగా కనులు మూసుకొని, ఆ తర్వాత వారిచ్చిన బీజాక్షరములను ఉచ్చరించడం చేత మనలో ఒక విధమైన విద్యుత్ ప్రసారం మొదలౌతుంది. అది మొదలైనప్పుడు లోపల మార్పులు జరుగుతాయి. అవి ఏమిటో మనకు తెలియదు. తెలిసినా చూస్తుండడమే తప్ప చేసేదేం లేదు. సాక్షిగా చూడడమే.

"నీ లోతట్టున ఏమేమి జరుగునో గమనించుచూ వుండు" అనడంలో "నీకేం తెలియదు, నువ్వేం చెయ్యవద్దు. నేను చేసుకుంటాను, నాకు వదిలెయ్యి." అని వారి ఉద్దేశ్యం. అలాగే ఆలోచనలు ఏమైనా వస్తే... పోనియ్యి, ఫర్వాలేదు. గమనిస్తూ వుంటే అవే తగ్గిపోతయి. అందుకని 15, 20, 30, 40నిల పాటు నీకు ఎంతసేపు లోపల ప్రసారం జరుగుతూ వుంటే అంతసేపు గమనిస్తూ వున్నట్లయితే, దాన్ని మన మాస్టరు గారికి సమర్పణ చేసి వదిలేసి నట్లయితే "కన్నులు తెరుద్దాం" అనే భావన వచేవరకు, ఆ విధంగా ఆ ప్రసారం జరుగుతుంది. కాబట్టి నిర్వర్తింప చేసుకోవాలి.

ఉదయం, సాయంత్రం 6గంల సమయానికి శరీరం, మనసు శుచిగా వుంచుకొని, మాస్టరుగారి చిత్రపటాన్ని ఉత్తర ముఖముగానో, తూర్పు ముఖముగానో వుంచి, అగరువత్తులు, దీపం వెలిగించి, సుఖము, స్థిరము అయిన ఆసనం ఏర్పరుచుకొని కూర్చోవాలి. హృదయంలోనో, భ్రూమద్యంలోనో మాస్టరుగారిని మానసికంగా దర్శించి, నమస్కారం చేస్తూ
"మాస్టర్ సి.వి.వి నమస్కారం" (Master C.V.V. Namaskaram) అని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినపుడు మాస్టరుగారు (పద్మాసనాసీనులై యున్నవారు) తన దక్షిణ (కుడి) హస్తంతో మనలను ఆశీర్వదిస్తున్నట్లు, యోగమారంభించ మంటున్నట్లు, తాను పని ప్రారంభిస్తున్నట్లు, మనము సాక్షీభూతముగా మన దేహ కోశములందు జరుగు మార్పు లను చూస్తున్నట్లు భావించాలి. మార్పులు జరుగుతున్నత సేపు కనులు తెరుచుకోవు. ఆ రోజుకు వర్కింగ్స్ (workings) పూర్తి అయిన తరువాత కనులు తెరుచుకుంటయి. ఏ రొజున ఎంతవరకు జరిగితే శ్రేయస్సో, అంతవరకే మాస్టరుగారు మార్పులు (వర్కింగ్స్) జరుపుతారు.

ప్రార్థనలో ముఖ్యాంశమేమిటంటే, మనము చేయవలసిన అభ్యర్థన. అది ఏమిటంటే:

"మాస్టరు గారు! పద్మకోశం వంటి ఈ నా శరీరంలోని సమస్త కోశములను పరిశుద్ధి గావించండి. భావములను, కోరికలను ధర్మయుక్తం చేయండి. ప్రాణమును పెంపోందించండి. కామమును తగ్గించండి. సూక్ష్మ శరీరమును తీర్చిదిద్దండి. అమరత్వం ప్రసాదించండి. మీ దివ్య ప్రణాళికలో నాకు కర్తవ్యాన్ని, బాధ్యతను ఏర్పరచండి. పరహితమునకు నన్నంకితం చేయండి. నేను మీకు సదా వాహికనై వుండునట్లు అనుగ్రహించండి."

పై అభ్యద్థన గావించి కనులు మూసుకొని కూర్చోవాలి. క్రమశః సాధకుని శ్రద్ధాభక్తుల బట్టి సాధన సిద్దిస్తుంది. మాస్టర్ E.K గారికి 12 సంలలో సిద్ధించినది. మాస్టర్ M.N గారికి కూడా అలాగే సిద్ధించినది. వారిరువురు యిపుడు దివ్య ప్రణాళికలో సింహభాగం వహించి యున్నారు. ఈ విధంగా మాస్టరుగారి ప్రార్థనతో దివ్య వాహికలు తయారు కాగలవు. అది మాస్టరు C.V.V గారి వాగ్దానం.

మాస్టర్ సి.వి.వి గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆయన శిష్యులకు త్రిసూత్ర ప్రణాళిక నిచ్చారు.
1. ఉదయము, సాయంత్రము ప్రేయరు చేయటం.
2. జీవితాన్ని సేవకు అంకితం చేయటం.
3. స్వలాభాపేక్షతో ఏ పని చేయకుండటం.

సాధకుడు తప్పనిసరిగా పైన ఇచ్చిన త్రిసూత్ర ప్రణాళికను 12 సంవత్సరాల కాలం పాటు క్రమశిక్షణతో అనుసరించవలసి ఉంటుంది.

మాస్టరు సి.వి.వి అనే బీజాక్షరాలలోని శబ్దతరంగములు మన మనస్సులలో, మనలో సంస్కారవశమున ఏర్పడిన భావముల నంతా మింగివేస్తాయి. మనం అనేక జన్మల నుండి వచ్చిన కర్మలు అనే ఇంధనం లోపల బాగా పేర్చుకొని వుంచుకున్నాం. దాన్ని ఆయన కాల్చేస్తారట. అది కాల్చడానికి ఈ మంత్రం. తొందరగా కాల్చేయడానికి ఈ పద్దతి పట్టుకొచ్చారు. "It is a dynamic change to the Science of Yoga" అని మాస్టరు E.K గారే వ్రాశారు. అన్నీ పరిణామం చెందుతున్నాయి. కాబట్టి యోగవిద్య కూడా పరిణామం చెందింది. ఈ యోగం గురించి వివరిస్తూ C.V.V. గారు ఇలా అన్నారు. It is neither post - ponement nor purging of Karma, but is neutralisation of it. అంటే "నేను ప్రారబ్ద కర్మను వాయిదా వేయను, ప్రచోదనము చేయను. కేవలం మీకోసం మింగేస్తాను" అన్నారు.

ఎవరైననూ మాస్టరు గారి ప్రార్థన చేసుకొన వచ్చును. దీనికి జాతి, మత, కుల, వర్ణ వివక్షత ఎంత మాత్రము లేదు. ఆయన సమస్త మానవ జాతిని ఉద్దరించి నడిపించుటకు వచ్చిన పరబహ్మము. ఇందు సందేహము అవసరము లేదు. నమ్మకము ముఖ్యము. ఆయను నమ్మి సమస్తము ఆయనకు సమర్పించి ఉండండి, అప్పుడు, ఆయనే మనకు సమస్త విషయములు మన లోపలి నుండే తెలియ చేయును, జీవితమును ఆనందమయము చేయును.

ఈ రోజు మన మాస్టరు గారి పుట్టిన రోజు. కనుక అందరకు మాస్టరు గారి దివ్య అనుగ్రహము, ఆశిస్సులు లభించవలెనని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రార్థిస్తున్నాము.