Monday, September 14, 2009

త్రిగుణ బంధనము



త్రిగుణ ప్రజ్ఞలు మూడును (ద్రవ్య రూపము, దేవతా ప్రజ్ఞలు, క్రియా రూపమైన ప్రజ్ఞలు) జీవునికి ఆశ్రయములుగా పనిచేయుచున్నవి. వీని ఆశ్రయము వలన జీవుడు మాయతో కూడిన వాడై బంధింప బడుచున్నాడు. మూడు ఆశ్రయములలోనూ మూడు బంధములు ఏర్పడును. పరిస్థితుల ప్రభావము వలన మనకు మన స్వస్వరూపము గుర్తు వుండదు. అంటే తాను కూడా మహా చైతన్యము నందలి భాగమే అని గుర్తు వుండదు. "నేను నేనైన నేను" అని గుర్తు వుండదు. నిద్ర లేవంగానే మనము దైవము ఒడిలోనుండి వచ్చాము అని గుర్తు వుండదు. అది ఒక ఆవరణ. అది సంకర్షణ వ్యూహము. అక్కడ నుండి దేవతారాథనము, దేవతా ప్రజ్ఞలతో అనుసంధానము వల్ల వాటి సహకారము కోరటము జరుగుతుంది. అంటే బుద్ది లోకములలోనికి వస్తాము. దానిని ప్రద్యుమ్న వ్యూహము అంటారు. తరువాత బాహ్య లోకములోనికి మనస్సు ద్వారా వస్తాము. అప్పుడు మనకు దేవతా ప్రజ్ఞలు కాని, మనము ఎక్కడనుండి వచ్చామో కూడా గుర్తు వుండదు. బయటి విషయాల్లో పట్టుబడి వుంటాము. అంతర్ముఖమవ్వాలంటే బాహ్యమే అడ్డు పడుతుంది. కన్నులు మూసుకున్నా బయటి విషయాలే గుర్తుకు వస్తాయి. అంటే బాహ్యము ఒక బంధమును ఇస్తుంది.

తరువాతి బంధము అంతరంలో స్వభావములో వుంటుంది. మూడవ బంధము నేనున్నానే భ్రమ. ఈ మూడు మూడు బంధాలుగా, ఆశ్రయాలుగా ఏర్పడతాయి. ఎవరికి? నాలుగో వాడైన జీవుడికి. ఇవన్నీ జీవుడికి ముసుగుల వంటివి. మన పేరు ఒక ముసుగు. మన రూపం ఒక ముసుగు. మన స్థితిగతులు మరియొక ముసుగు. మన స్వభావం, మనగురించి మనకున్న భావనలు కూడా ముసుగులే. ఈ ముసుగులన్నీ తొలగిస్తే వున్న ఈశ్వరుడే జీవుడు. వీటిని తొలగించుట అంత సులభము కాదు. ఇవన్నీ ముసుగులే అన్న భావన ఎప్పూడు గుర్తు వుండాలి. లేకపోతే మాయ కమ్మివేస్తూ వుంటుంది.

మాయ వల్లనూ, ఈ మూడు బంధముల వల్లనూ మూడు ఆవరణలు ఏర్పడి మూడు శరీరములు ఏర్పడతాయి. అవి ఒకదానిలో ఒకటి వుంటాయి. ఒకటి క్రియా రూపమునకు సంబందించినది. అదే స్థూల శరీరము. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము నందు మనసు, ఇంద్రియములు పనిచేస్తూ వుంటాయి. దీనికి పైన దేవతా ప్రజ్ఞలతో కూడిన ఇంకొక రూపము వుంది. దానినే బంగారు శరీరము అనియు, సూక్ష్మ శరీరము అనియు, దివ్య శరీరము అనియు అంటారు. దివి అనగా వెలుగు. దేవత అనగా వెలుగు రూపము అని అర్థము. ఇది బంగారు కాంతితో వుంటుంది. దీనికి పైన తాను దిగివచ్చిన కారణము (పరిపూర్ణత కొరకు) తో కూడిన శరీరము వుంటుంది. ఇది తెల్లని వజ్ర కాంతితో వుంటుంది. ఇది తాను దిగివచ్చిన కారణము కొరకు మాత్రమే దేవతా ప్రజ్ఞలతో అనుసంధానము చెందినవారికి వుంటుంది. దానిని కారణ శరీరము లేక లింగ శరీరము అంటారు. ఈ మూడును జీవునకు మూడు ఆవరణలు. వీటిని లింగములుగా చేసుకొని ఈశ్వరుడు జీవుడగుచున్నాడు. లింగములనగా చిహ్నములు. గుర్తింపదగినవి. వీటి వలననే జీవుడు వున్నట్లు తెలియును. అనగా జీవుడుగా దేవుడున్నట్లు తెలియును. అన్నిటియందు వర్తిస్తున్న ఈశ్వరుడ్ని దర్శించేవానికే ఇది తెలియును. అనగా ఎవరైతా తాను అను ప్రజ్ఞగా వుంటారో వారికి తెలియును. ఇతరములు కనిపించినచో ఈశ్వరుడు కనిపించడు. "నేను అను పదమునకు అర్థమైన తనకు తెలుయునుగాని, నీవు అను పదమునకు అర్థమైన ఇతరులను గమనించు దృష్టికి అందదు." అని మాస్టరు ఇ.కె గారు భాగవత రహస్య ప్రకాశము నందు తెలియపరచినారు.

మనసు బాహ్యములోనికి పనిచేస్తూ వుంటుంది. దానిని అంతరంలోనికి మళ్ళించుట ప్రధాన కార్యక్రమము. అప్పుడు అది లోపల అద్భుతమైన వెలుగును దర్శించి క్రమంగా బుద్దిలోనికి పెరుగుతుంది. దాన్ని చిత్తము నుండి బుద్దిలోనికి పెరగటం అంటారు. చిత్తము ఇంద్రియ ఆకర్షణల చేత బయటకు వెళ్ళటం చేత దానికి వృత్తులు ఏర్పడతాయి. యోగ శాస్త్ర ప్రకారం ఈ చిత్త వృత్తులని నిరోధించి బుద్దిలోనికి పెరగటమే యోగము నందు మొదటు మెట్టు. మనలోని దేవతలందరిని (అష్ట దిక్పాలకుల్ని, నవగ్రహాల్ని, ద్వాదశ ఆదిత్యుల్ని, ఏకాదశ రుద్రుల్ని, అష్ట వసువుల్ని, త్రిమూర్తుల్ని, త్రిశక్తుల్ని, షట్చక్రాల్ని, అశ్వనీ దేవతలను మొ) లోపల బాగా స్మరించినచో మనకు బయటి విషయములు గుర్తుకు రాక మనసు బుద్ది యంది నిలచుట జరుగును. ఈ దేవతలందరు మనలో ఏ ఏ కేంద్రములలో వున్నారో అవి తెలియాలి. సాధారణంగా మనము అందరి దేవతలో కూడిన ఒక ఆవు బొమ్మ కాలండెర్ చూస్తూ వుంటాం. మనలో కూడా దేవతలందరూ అలానే వుంటారు.

దేవతా స్థానములు
సూర్య, చంద్రులు కుడి, ఎడమ కన్నులుగా వున్నారు. అగ్ని మూడవ కన్నుగా వున్నాడు.
మిత్రా, వరుణులు కుడి, ఎడమ నాసికలుగా వున్నారు. నాసిక యందు వాయువు వున్నాడు.
ఫాల భాగము నందు శివుడు, దానికి పైన కుబేరుడు, ఈశానుడు వున్నారు.
కుడి చెవి యందు బుధుడు, ఎడమ చెవి యందు బృహస్పతి (గురుడు) వున్నారు.
నాలుక కొన యందు సరస్వతి, పై కంఠము నందు వాగీశ్వరి ( వాక్కు) అను దేవత, కొంచము దిగువన నకుళీ వాగీశ్వరి ( భావమయ వాక్కు) అను దేవత వుంటారు.
హృదయము నందు విష్ణువు, మెడ వెనక మూపురము వంటి ప్రదేశములో బ్రహ్మ, ఉదరము నందు అగ్ని వున్నారు.
ముఖము ఇంద్రుడిగా వున్నది. మాటలోని చేతన అగ్నిగా వున్నది. శిరస్సు అంతా కూడా దివ్య లోకంగా భావించాలి. ఏడు కేంద్రములలో సప్త ఋషులు వున్నారు. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యందు అష్ట దిక్పాలకులు వున్నారు. శిఖ యందు వేనుడు వున్నాడు. పైన ఇంద్రా విష్ణు వున్నాడు.

సప్త ఋషులు వారి స్థానములు:
అత్రి --> సహస్రార కేంద్రము (త్రిగుణాతీతమైన తత్వము)
భృగువు --> ఆజ్ఞా కేంద్రము (భృగు అనగా వెలుగు) గాయత్రి యందు చెప్పబడిన భర్గో దేవుడు.
అంగీరసుడు --> విశుద్ధి కేంద్రము (అవయములు ఏర్పడుట, లోకములు ఏర్పడుట, భగవంతుడు రసమయ స్వరూపుడై వుండుట, ప్రాణము, చేతనము)
వశిష్టుడు --> అనాహత కేంద్రము (శాంతముగా, ఆనందముగా, సంతోషముతో పరితుష్టిగా, తృప్తితో పరిపూర్ణ జ్ఞానముతో నివసించువాడు)
పులహుడు --> మణిపూరక కేంద్రము (పులిసే వాడు. కోరికలతో వూరే వాడు, కోరికలను, ఆలోచనలను కలిగించువాడు)
పౌలస్త్యుడు --> స్వాథిస్ఠాన కేంద్రము (ఇంద్రియ ప్రజ్ఞ, ఇంద్రియ లోలత్వమును కలిగించు వాడు. ఇంద్రియము లేనిదే అనుభూతి లేదు.)
క్రతువు --> మూలాధార కేంద్రము (క్రమ బద్దమైన జీవితమును అనుగ్రహించువాడు)

గ్రహములు వాటి స్థానములు
సహస్రారము నందు బృహస్పతి (అంతర్యామి ప్రజ్ఞ), ఆజ్ఞలో సూర్యుడు, కంఠము నందు బుధుడు, హృదయములో శుక్రుడు, మణిపూరకము నందు చంద్రుడు, స్వాథిస్ఠానములో కుజుడు, మూలాధారము నందు శనిని దర్శనము చేయవలెను.

దిక్కులు
సహస్రారము నందు ఊర్ధ్వమును, ఆజ్ఞ తూర్పును, స్వాథిస్ఠానము నందు ఆగ్నేయమును, హృదయము నందు దక్షిణము, అధమ మూలాధారము నందు నైఋతిని, ఉత్తమ మూలాధారము నందు పడమరను, శిఖ యందు ఉత్తరము, అధస్సును పాదముల యందును దర్శనము చేయవలయును.

అలా సమస్త దేవతా దర్శనము, ఋషి దర్శనము, సప్త గ్రహ దర్శనము, దిక్కులు మనయందు దర్శించి నమస్కరిస్తే మనస్సు అంతర్ముఖమై బుద్ది యందు నిలుస్తుంది. లేనిచో బయటి విషయముల యందే సంచరిస్తుంది. పూజ చేస్తున్నా, స్తోత్రము చదువుతున్నా మనస్సు అంతర్ముఖము అవక కలత చెందుతుంది. ఎదో మనమూ చేశాము అని పిస్తుందే కాని వాటిపై నిలవదు. కారణము సరియైన దేవతారాధానము లేకపోవుటయే.

బుద్ది యందు నిలచినవాడికే త్రిగుణముల తత్వము బోధ పడి వాటికి ఆవల వున్న అంతర్యామిని దర్శించ గలడు.