Friday, February 20, 2015

శ్రీమద్భాగవతము నందు శుక యోగీంద్రుడు చేసిన దైవ గురు ప్రశంస

శ్రీమద్భాగవతము నందు పరిక్షిత్ మహరాజుకు భాగవతము తెలియజేయుట ప్రారంభము చేస్తూ శుక యోగీంద్రుడు చేసిన దైవ గురు ప్రశంసగజేంద్రమోక్షము ఘట్టములోని పద్యముల వలే ఇవి కూడా అంతర్యామి అయిన పరమేశ్వరుని కీర్తిస్తాయిప్రతిరోజు పఠించినచో భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి యోగమునందు సాథకుని మనస్సు, బుద్ది స్థిరపడును పద్యములు శ్రీమద్భాగవతము నందలి 2 అధ్యాయములో 58 పద్యము నుండి 69 పద్యము వరకు ఉంటాయి.

2-58-.
పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.

2-59-.
మఱియు సజ్జనదురితసంహారకుండును, దుర్జన నివారకుండును సర్వరూపకుండును, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయకమల కర్ణికామధ్య ప్రదీపకుండును, సాత్వతశ్రేష్టుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్టుండును, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూపబ్రహ్మవిహారుండును నైన యప్పరమేశ్వరునకు నమస్కరించెద.

2-60-.
విభువందనార్చనములే విభుచింతయు నామకీర్తనం
బే విభులీల లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

2-61-.
పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధితో నుభయలోకములందుల జడ్డుఁ బాసి, యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

2-62-.
తపములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే
జపములఁ జేసియైన ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు
య్యపరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

2-63-.
యవనవ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సం
భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా
గవతశ్రేష్ఠులఁ డాసి శుద్ధతనులై కళ్యాణులై యుందు రా
యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్.

2-64-.
తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు
బ్దపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని
య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నాకెప్పుడున్.

2-65-.
శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర
జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవశ్రే
ణీపతియున్ గతియునైన నిపుణు భజింతున్.

2-66-.
అణువోగాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో,
గుణియో, నిర్గుణుఁడో, యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా
ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్.

2-67-.
జగదుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే
భగవంతుండు సరస్వతిం బనుప నా పద్మాస్య దా నవ్విభున్
మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా
రగుఁ జేసెన్ మును బ్రహ్మ; నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్.

2-68-సీ.
పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ;
మున మేనులను పురములు సృజించి
పురములలోనుండి పురుషభావంబున;
దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ
బంచభూతములను పదునొకం డింద్రయ;
ములఁ బ్రకాశింపించి భూరిమహిమ
షోడశాత్మకుఁడన శోభిల్లు జీవత్వ;
నృత్త వినోదంబు నెఱపుచుండు

2-68.1-తే.
నట్టి భగవంతుఁ డవ్యయుం డచ్యుతుండు
మానసోదిత వాక్పుష్ప మాలికలను
మంజు నవరస మకరంద మహిమ లుట్ట
శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత.

2-69-.
మానధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ
ధ్యాన మరంద పానమున నాత్మ భయంబులఁ బాసి ముక్తులై
లూనత నొంద; రట్టి మునిలోకశిఖామణికిన్ విశంక టా
జ్ఞానతమోనభోమణికి సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్.